21 July 2010

నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు--Kodallu Didhina Kapuram

పల్లవి:

నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు

చరణం1:

సత్యం కోసం సతినే అమ్మిన్నదెవరు ... హరిచంద్రుడు
తండ్రిమాటకై కానలకేగినదెవరు ... శ్రీరామచంద్రుడు
అన్న సేవకే అంకితమైనదెవరన్నా ... లక్ష్మన్న
పతియే దైవమని తరించింపోయినదెవరమ్మ ... సీతమ్మ
ఆ పుణ్యమూర్తులు చూపినమార్గం అనుసరించుటే ధర్మం
అనుసరించుటే నీ ధర్మం
నీ ధర్మం మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు

చరణం2:

చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న
మేడిపండులా మెరిసే సంగం గుట్టువిప్పెను వేమన్న
వితంతుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించె కందుకూరి
తెలుగు భారతిని ప్రజలభాషలో తీరిచిదిద్దెను గురజాడ
ఆ సంస్కర్తల ఆశయరంగం నీవు నిలిచిన సంఘం
నీవు నిలిచిన ఈ సంఘం
నీ సంఘం మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు

చరణం3:

స్వతంత్రభారత రధసారధియై సమరాన దూకె నేతాజి
సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చె బాపూజి
గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి
తెలుగువారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయెను అమరజీవి
ఆ దేశభక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం
నీవు పుట్టిన ఈ దేశం

నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
మహనీయులనే మరవద్దు

No comments: